భూకబ్జా కేసులో కోర్టుకు హాజరైన 'పరమశివుడు'!

  • భూ ఆక్రమణ కేసులో శివుడుతోపాటు మరో 9 మందికి నోటీసులు
  • విచారణకు హాజరు కాకుంటే రూ. 10 వేల జరిమానా తప్పదని హెచ్చరిక
  • శివలింగాన్ని తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచిన అధికారులు
భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. పరమశివుడు (విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా విచారణకు హాజరయ్యారు. 

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ..  ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక విచారణ ప్రారంభించి 10 మందికి నోటీసులిచ్చింది. ఈ నెల 25న జరగనున్న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

అంతేకాదు, విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. చర్యల్లో భాగంగా భూమిని ఖాళీ చేయించి రూ. 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని అందులో పేర్కొంది. దీంతో నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు.

Lord Shiva
High Court
Chhattisgarh

More Telugu News